మంత్రి శ్రీ కేటీఆర్ చొరవతో దశాబ్దాల భూవివాదాలకు పరిష్కారం
ఎల్బీనగర్ నియోజకవర్గంలో దశాబ్దకాలంగా ఉన్న భూ సంబంధిత వివాదాలకు రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి శ్రీ కెటి రామారావు చొరవతో నేడు పరిష్కార మార్గం లభించింది. ఇటీవల ఎల్బీనగర్లో జరిగిన మన నగరం కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ఎల్బీనగర్ నియోజకవర్గంలోని పలు కాలనీల నుండి భూ సంబంధిత వివాదాలు రాగా, వీటి పరిష్కారానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి శ్రీ మహమూద్ అలీ, సి.సి.ఎల్.ఏ రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల కలెక్టర్లు, సంబంధిత అధికారులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి పరిష్కారానికి చర్యలు చేపట్టనున్నట్టు మంత్రి కేటీఆర్ ప్రకటించారు. దీనికి అనుగుణంగా నేడు ఎల్బీనగర్ జీహెచ్ఎంసీ జోనల్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశానికి ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, నగర మేయర్ బొంతు రామ్మోహన్, ఎంపి మల్లారెడ్డి, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, ఎమ్మెల్యేలు ఆర్.కృష్ణయ్య, తీగల కృష్ణారెడ్డి, సి.సి.ఎల్.ఏ రాజేశ్వర్ తివారి, మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల కలెక్టర్ ఎన్.వి.రెడ్డి, సంబంధిత శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సమావేశంలో దాదాపు 20 కాలనీలు, బస్తీలకు చెందిన వివాదంలో ఉన్న భూములపై క్షుణ్ణంగా చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి కెటి రామారావు మాట్లాడుతూ అసైండ్, వక్ఫ్, ఎండోమెంట్స్, ఎఫ్.టి.ఎల్లకు సంబంధిత వివాదాలు అధికంగా ఉన్నాయని, వీటిలో పాలన సంబంధిత అంశాలను పదిహేను రోజుల్లోగా పరిష్కరించనున్నట్టు స్పష్టం చేశారు. ఆర్డీఓ స్థాయిలో కేవలం రికార్డుల సవరణ చేయకపోవడం వల్ల కొన్ని సమస్యలు తలెత్తాయని, ఈ రికార్డులను వెంటనే సవరించాలని ఆర్డిఓలను ఆదేశించారు. అదేవిధంగా చట్టాలను సవరించాల్సి వస్తే వాటికి సంబంధించి తీర్మాణాలను వచ్చే క్యాబినేట్ సమావేశంలో చర్చించి శీతాకాల అసెంబ్లీ సమావేశాల్లో చట్ట సవరణ చేపట్టే విషయాన్ని పరిశీలిస్తామని పేర్కొన్నారు. ముఖ్యంగా అసైండ్ భూముల విషయంపై తగు అద్యయనం చేసి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని అన్నారు. వక్ఫ్ భూముల వివాదాలకు సంబంధించి త్వరలోనే ఉప ముఖ్యమంత్రి శ్రీ మహమూద్ అలీ నేతృత్వంలో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి తగు నిర్ణయం చేపడుతామని, అదేవిధంగా స్వాతంత్ర సమరయోధులకు కేటాయించిన భూములను విక్రయాలు జరిపి పదేళ్లకు పైగా ఉన్న నిర్మాణాలకు రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు అనువుగా ఎన్ఓసి లను జారీచేయడానికి చర్యలు చేపడుతామని పేర్కొన్నారు. ఈ విషయంలో ప్రతి కేసును క్షుణ్ణంగా పరిశీలించడం జరుగుతుందని అన్నారు. అయితే చెరువుల ఎఫ్టిఎల్, ఎఫ్టిఎల్ పరిధిలో, పరిరక్షణ జోన్లలో ఉన్న నిర్మాణాలపై జోక్యం చేసుకోమని స్పష్టం చేశారు. మన్సూరాబాద్ సర్వే నెం-44,45 లలో సీలింగ్ భూముల్లో ఉన్న నిర్మాణాలకు 2007లో ఉన్న రిజిస్ట్రేషన్ వాల్యూ ప్రకారం క్రమబద్దీకరించాలని ఆయా కాలనీ వాసులు విజ్ఞప్తి చేయగా ఈ విషయాన్ని పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. నాగోల్ సాయి నగర్ లోనిని 101,102 సర్వేలలో ఉన్న 1952 ఇళ్లకు సంబంధించి భూ రికార్డులలో తప్పుగా పేర్కొన్నందున ఇప్పటికీ సమస్యగా ఉన్నందున వెంటనే ఈ రికార్డులను పదిహేను రోజుల్లోగా సవరించాలని రంగారెడ్డి ఇంచార్జ్ కలెక్టర్ ఎన్వి రెడ్డిని ఆదేశించారు. సుప్రీంకోర్టు ఆదేశాలు స్పష్టంగా ఉన్నందున ఎఫ్టిఎల్, కన్జర్వేషన్ జోన్ల జోలికి తాము వెళ్లమని స్పష్టం చేశారు. గ్రీన్ పార్కు కాలనీ సమీపంలో ఖాళీగా ఉన్న 3,200 గజాల స్థలంలో స్పోర్ట్స్ కాంప్లెక్స్ను నిర్మించాలని కార్పొరేటర్ ఎం.శ్రీనివాసరావు చేసిన విజ్ఞప్తికి స్పందిస్తూ ఈ భూమి విషయంలో ఏవిధమైన వివాదం లేకపోతే వెంటనే స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణానికి చర్యలు తీసుకోవాల్సిందిగా జోనల్ కమిషనర్ ను మంత్రి ఆదేశించారు. 58,59 జీ.వోల కింద గతంలో దరఖాస్తు చేసుకోనివారికి మరో సారి దరఖాస్తు చేసుకునేలా అవకాశం కల్పించనున్నట్టు తెలిపారు. దాదాపు నాలుగు గంటల పాటు కొనసాగిన ఈ సమావేశానికి హాజరైన ప్రతి ఒక్కరి సమస్యను ప్రత్యేకంగా సమీక్షించారు. ఈ సమావేశానికి జోనల్ కమిషనర్ శ్రీనివాస్రెడ్డి, ఆర్డిఓలు రవీందర్రెడ్డి, మధుకర్ రెడ్డి, మధుసూదన్లతో పాటు వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు.