మిషన్ భగీరథ ( అర్బన్ ) పనులను ఈ ఆగస్టు మాసంలోగా పూర్తి చేయాలి- పురపాలక శాఖ మంత్రి కె టి రామారావు
• వర్కింగ్ ఏజెన్సీలకు మంత్రి అదేశం
• వర్షకాలం నేపథ్యంలో పైపులైన్ల నిర్మాణం కోసం తవ్విన రహాదారులను వేంటనే రిస్టోర్ చేసేందుకు చర్యలు తీసుకోవాలి
• పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ విభాగాన్ని మరింతగా బలోపేతం చేస్తామన్న మంత్రి
• నూతనంగా ఏర్పడనున్న పురపాలికల్లో అవసరమైన కనీస మౌళిక వసతులు, మానవ వనరులను ఇప్పటి నుంచే గుర్తించాలన్న మంత్రి
పట్టణాల్లో తాగునీరు అందించేందుకు ఉద్దేశించిన మిషన్ భగీరథ ( అర్బన్ ) పనులను ఈ ఆగస్టు మాసంలోగా పూర్తి చేయాలని వర్కింగ్ ఏజెన్సీలను పురపాలక శాఖ మంత్రి కె టి రామారావు ఆదేశించారు. ఈ రోజు బేగంపేట మెట్రో రైల్ భవన్ లో జరిగిన మిషన్ భగీరథ అర్బన్ సమీక్షా సమావేశంలో అధికారులు, వర్కింగ్ ఎజెన్సీలతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని వివిధ పట్టణాల్లో మిషన్ భగీరథ అర్బన్ పనుల పురోగతిని ఈ సందర్భంగా మంత్రి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటికే చాలా పట్టణాల్లో పనులు వేగంగా నడుస్తున్నాయని, నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేస్తామన్న నమ్మకాన్ని వర్కింగ్ ఎజెన్సీలు వ్యక్తం చేశాయి. వర్షాలు ఆరంభం అయినా చాలా వరకు సివిల్ నిర్మాణాలు సేఫ్ స్టేజీకి చేరుకున్నాయని, పనుల్లో పెద్ద ఆటంకాలు ఉండకపోవచ్చన్నారు. వచ్చే ఆగస్టు నాటికి దాదాపుగా అన్ని పైపులైన్ల నిర్మాణం పూర్తి అవుతుందని అధికారులు తెలిపారు. దీంతోపాటు వివిధ కారణాల చేత ఆలస్యం అయిన కొన్ని చోట్ల మాత్రం అక్టోబర్ మాసానికి సివిల్ నిర్మాణాలు పూర్తి అవుతాయని అధికారులు మంత్రికి తెలిపారు. వర్షకాలం నేపథ్యంలో పైపులైన్ల నిర్మాణం కోసం తవ్విన రహాదారులను వేంట వేంటనే రిస్టోర్ చేసేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రి పురపాలక శాఖాధికారులను ఆదేశించారు.
పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ విభాగాన్ని మరింతగా బలోపేతం చేస్తామని మంత్రి సమావేశంలో పెర్కోన్నారు. పెరిగిన మున్సిపాలీటీలు, పట్టణాల్లో చేపడుతున్న మౌళిక వసతుల ప్రాజెక్టులకు అవసరమైన మేరకు సిబ్బందిని అనుమతించాలని ఈఏన్ సి ( పిహెచ్ ) కోరారు. ఈ సందర్భంగా ఇప్పటి దాకా టియూయప్ ఐడిసి ద్వారా పట్టణాలకు ఇస్తున్న నిధులతో చేపట్టాల్సిన పనుల ప్రణాళికలు( డిపిఆర్)లను సమీక్షించిన మంత్రి, నెలాఖరు నాటికి టెండర్లు పూర్తి అయ్యేలా చూడాలన్నారు. ఈమేరకు జిల్లాల కలెక్టర్లతో ప్రత్యేకంగా చర్చించాలని పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్ కూమార్ కి ఆదేశాలు జారీ చేశారు. ఈ ప్రత్యేక నిధులతో చేపట్టే కార్యక్రమాలను వచ్చే ఆరు నెలల్లోగా పూర్తి అయ్యేలా గడువును టెండర్లలో పొందు పర్చాలని, గడువులోగా పనులు పూర్తి అయ్యేలా చూడాల్సిన భాధ్యత తీసుకోవాలన్నారు. నూతనంగా ఏర్పడనున్న పురపాలికల్లో అవసరమైన కనీస మౌళిక వసతులు, మానవ వనరులను ఇప్పటి నుంచే గుర్తించాలన్నారు.
ఈ సమావేశంలో పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కూమార్ తో పాటు, ఈఏన్ సి ( పిహెచ్) దన్ సింగ్ నాయక్, అధికారులు, వర్కింగ్ ఏజెన్సీల ప్రతినిధులు పాల్గోన్నారు.