హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్క్లబ్లో ప్రముఖ రచయిత సురవరం ప్రతాపరెడ్డి 125వ జయంతి ఉత్సవాలలో పాల్గొన్న మంత్రి కేటీఆర్
హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్క్లబ్లో ప్రముఖ రచయిత సురవరం ప్రతాపరెడ్డి 125వ జయంతి ఉత్సవాలు జరిగాయి. ఈ ఉత్సవాలకు ముఖ్య అతిథిగా ఐటీ శాఖ మంత్రి శ్రీ కేటీఆర్, విశిష్ట అతిథులుగా మంత్రులు శ్రీ నిరంజన్ రెడ్డి, శ్రీ వి. శ్రీనివాస్ గౌడ్ మరియు సురవరం ప్రతాప రెడ్డి కుటుంబసభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సురవరం చిత్రానికి మంత్రులు పూలమాల వేసి నివాళులర్పించారు.
అనంతరం మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ సురవరం ప్రతాపరెడ్డి గారి జయంతి ఉత్సవాలకు ఆహ్వానించినందుకు సురవరం కుటుంబ సభ్యులకు కృతఙ్ఞతలు తెలిపారు. సురవరం ప్రతాప రెడ్డి గారి పేరు వినగానే మనకు గుర్తుకు వచ్చేది గోలకొండ పత్రిక అన్నారు. ఈ గోలకొండ కాకుండా ప్రతాప రెడ్డి గారి లోని మిగతా కోణాలు, పార్శ్వాలు తెలుసుకునే అవకాశం ఈ కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా కలిగిందన్నారు. సురవరం సంకలనాల ద్వారా చాలా విషయాలు తెలుసుకున్నానని, సురవరం ప్రతాపరెడ్డి గారు అభ్యుదయ భావాలు కలిగిన వ్యక్తి.. ఆయన జీవితం సంఘర్షణమయమన్నారు. ఒక సంఘసంస్కర్తగా, సంపాదకుడిగా, పాత్రికేయుడిగా, కవిగా, రచయితగా, సాహితీవేత్తగా ఆయన సేవలు చిరస్మరణీయం అన్నారు. 125 సంవత్సరాల తర్వాత కూడా సురవరం ప్రతాపరెడ్డి గారిని స్మరించుకోవడం ఎంతో గొప్ప విషయం అన్నారు. పెద్దలు చెప్పినట్లు ఎంత కాలం జీవించామన్నది కాదు.. ఎలా జీవించామన్నది ముఖ్యమన్నారు.
నిజాం రాజ్యంలో కవులు లేరు అన్న రాఘవా చార్యులు గారి మాటలతో మనసు గాయపడి తెలంగాణలోని 350 పైగా కవులను వారి సంకలనాలను ఒక్కచోట చేర్చి తెలంగాణ అస్తిత్వపు భావజాలాన్ని, తెలంగాణ సాహిత్యపు గొప్పతనాన్ని చాటిచెప్పిన ఘనత సురవరం ప్రతాపరెడ్డి గారిదన్నారు. తెలంగాణ రాష్ట్రం నిజంగా ఏర్పడక పోయి ఉంటె ఇలాంటి మహానుభావుల గురించి ఇంతగొప్పగా ప్రభుత్వ ప్రతినిధులుగా సగర్వంగా, భవిష్యత్ తరాలకు తెలిసేలా స్మరించుకునే అవకాశం ఉండకపోయేదన్నారు. ఈ రోజు తెలంగాణలో ఉన్న 4 విశ్వవిద్యాలయాలకు కాళోజి నారాయణ రావు, పి.వి. నరసింహారావు, ఆచార్య జయశంకర్, కొండా లక్ష్మణ్ బాపూజీ గార్ల పేర్లను పెట్టుకున్నామన్నారు. అదే కోవలో సురవరం ప్రతాపరెడ్డి గారి పేరు కూడా చేర్చి వారికి సముచిత స్థానం కల్పించాలన్న మంత్రి నిరంజన్ రెడ్డి గారి విజ్ఞప్తిని సీఎం కేసీఆర్ గారి దృష్టికి అందరం కలిసికట్టుగా తీసుకొని వెళ్తామన్నారు.
సీఎం కేసీఆర్ గారు చెప్పినట్లు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో ఇమిడి ఉన్న ఒక ముఖ్యమైన అంశం తెలంగాణ సాంస్కృతిక పునరుజ్జీవనం అన్నారు. పీవీ నరసింహారావు గారి శతజయంతి ఉత్సవాలు జరుపుకుంటున్న క్రమంలో సురవరం ప్రతాప రెడ్డి గారి 125 వ జయంతి కూడా రావడం ఇద్దరు మహానుభావులను ఒకేసారి మనకు స్మరించుకునే అవకాశం రావడం ఎంతో సంతోషంగా ఉందని కేటీఆర్ అన్నారు.