తెలంగాణ ప్రభుత్వ ప్రాధాన్యత రంగాలైన ఫుడ్ ప్రాసెసింగ్, ఐటీ, ఏరోస్పేస్ & డిఫెన్స్, ఫార్మా మరియు లైఫ్ సైన్సెస్ వంటి రంగాల్లో అనేక కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు సంసిద్ధత వ్యక్తం చేశాయని, పలు కంపెనీలు తమ ఆసక్తిని వివిధ శాఖల అధికారులకు తెలియజేశాయని అధికారులు మంత్రికి తెలియజేశారు. అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పరిశ్రమల ఏర్పాటు జరగాలన్నది ప్రభుత్వ లక్ష్యం అని, ఆ మేరకు పారిశ్రామిక వికేంద్రీకరణ జరగాల్సిన అవసరం ఉన్నదని, దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతిపాదిత పెట్టుబడులను వివిధ జిల్లాలకు తరలించేలా ఆయా కంపెనీలను కోరాలని మంత్రి సూచించారు. ఇప్పటికే పలువురు జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు తమ తమ ప్రాంతాల్లో అందుబాటులో ఉన్న భూముల వివరాలను ప్రభుత్వానికి అందజేశారని, అటువంటి ప్రాంతాలకు ఈ పెట్టుబడులు తరలివెళ్లేలా ప్రయత్నించాలని వివిధ శాఖల డైరెక్టర్లకు మంత్రి కేటీఆర్ సూచించారు.