A delegation headed by High Commissioner of Republic of Singapore to India H.E Mr. Simon Wong, called on Minister Sri KTR in Hyderabad
A delegation headed by High Commissioner of Republic of Singapore to India H.E Mr. Simon Wong, called on Minister Sri KTR in Hyderabad today. Principal Secretary Jayesh Ranjan was also present in the meeting. During the meeting, Minister KTR stated that Telangana Govt’s friendly industrial policies have helped attract major global companies to the State. He added that many Singapore based firms have already established their units here & are positive about the State’s ecosystem.
తెలంగాణ రాష్ట్రంలో నూతన రంగాల్లో అనేక పెట్టుబడి అవకాశాలు ఉన్నాయని, ఈ అవకాశాలను సింగపూర్ కంపెనీలకు, పెట్టుబడిదారులకు పరిచయం చేయడంలో సహకారం అందిస్తామని భారతదేశంలో సింగపూర్ హై కమిషనర్ సిమోన్ వాంగ్ అన్నారు. ఈరోజు ప్రగతి భవన్ లో పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ కేటీఆర్ తో సింగపూర్ హైకమిషనర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా హైదరాబాద్ మరియు తెలంగాణ గురించి మంత్రి కేటీఆర్ పలు వివరాలు అందించారు. హైదరాబాద్ నగరం కొన్ని వందల సంవత్సరాల నుంచి దేశంలోని ఇతర నగరాలకు భిన్నంగా కాస్మోపాలిటన్ స్వభావంతో అభివృద్ధి చెందుతూ వస్తున్నదని, ఇక్కడ అనేక రాష్ట్రాలతో పాటు వివిధ దేశాలకు చెందిన కంపెనీలు, వారి సిబ్బంది దీర్ఘకాలంగా పని చేస్తున్నారని ఈ సందర్భంగా కేటీఆర్ అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి అద్భుతమైన ప్రభుత్వ విధానాలతో పాటు, టీఎస్- ఐపాస్, సింగిల్ విండో అనుమతుల వంటి వాటితో అనేక అంతర్జాతీయ పెట్టుబడులను తెలంగాణకు తీసుకురాగలిగిగామని ఈ సందర్భంగా కేటిఆర్ హై కమిషనర్ కు వివరించారు. తెలంగాణ కేవలం దేశంలోని ఇతర రాష్ట్రాలతోనే కాకుండా అంతర్జాతీయంగా నెలకొన్న పోటీని దృష్టిలో ఉంచుకుని ప్రపంచంతో పెట్టుబడులు ఆకర్షించేందుకు పోటీ పడుతుందని తెలిపారు. ఇక్కడ ఉన్న లైఫ్ సైన్సెస్, ఫార్మా, ఐటీ, టెక్స్టైల్, ఫుడ్ ప్రాసెసింగ్, అగ్రికల్చర్ వంటి పలు రంగాల్లో అద్భుతమైన పెట్టుబడి అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఇప్పటికే అనేక సింగపూర్ కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టి తమ కార్యకలాపాల పట్ల సానుకూలంగా ఉన్నాయని కేటీఆర్ అన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టిన డిబిఎస్ వంటి కంపెనీలు, తమకు ఇక్కడ ఉన్న వాతావరణం గురించి సానుకూల ఫీడ్ బ్యాక్ అందించాయని హై కమిషనర్ మంత్రి కేటీఆర్ కు తెలిపారు. సింగపూర్ కంపెనీలు ఐటి, ఇన్నోవేషన్, ఐటి అనుబంధ రంగాల్లో ఉన్న బ్లాక్ చైన్ వంటి నూతన రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు చొరవ చూపిస్తున్నాయని వాంగ్ తెలిపారు. హైదరాబాదులో ఉన్న టి హబ్ వంటి కార్యక్రమాల ద్వారా ఇక్కడ ఉన్న ఐటి ఈకో సిస్టం, ఇన్నోవేషన్ సిస్టం గురించిన సానుకూలతలు తెలుసన్నారు. ఒకవైపు ఆధునిక రంగాలలో పెట్టుబడులతో పాటు అగ్రికల్చర్, ఫుడ్ ప్రాసెసింగ్ వంటి రంగాల్లోనూ సింగపూర్ కంపెనీలు ఇక్కడ ఉన్న అవకాశాలు పట్ల ఆసక్తితో ఉన్నాయని తెలిపారు.
సింగపూర్ కంపెనీలు ముందుకు వస్తే తెలంగాణలో ప్రత్యేకంగా సింగపూర్ పెట్టుబడుల కోసం ఒక ప్రత్యేక జోన్ లేదా సింగపూర్ హబ్ ఏర్పాటు చేసేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉంటుందని ఈ సందర్భంగా కేటీఆర్ ప్రతిపాదించారు. మంత్రి కేటీఆర్ ప్రతిపాదించిన సింగపూర్ పెట్టుబడులకు ప్రత్యేకంగా ఒక హబ్ ఏర్పాటు చేయడం ఒక గొప్ప ఆలోచన అని, గతంలో తాను వియత్నంలో పని చేసినప్పుడు ఇలాంటి ఒక ప్రయత్నం అక్కడ అనేక పెట్టుబడులను ఆకర్షించి, విజయవంతంగా కొనసాగుతున్నదని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ కు వాంగ్ తెలిపారు. ఖచ్చితంగా ఈ అంశాన్ని సానుకూలంగా పరిశీలిస్తామని ఆయన తెలిపారు.