రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను సానుకూలంగా పరిష్కరిస్తామని ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. ఉద్యోగుల సమస్యలన్నింటిపై చర్చించేందుకు మంత్రులు ఈటల రాజేందర్, కేటీఆర్, జగదీశ్రెడ్డిలు ఉద్యోగ సంఘాల నేతలతో ఇవాళ భేటీ అయ్యారు. భేటీ అనంతరం మంత్రి ఈటల వివరాలను వెల్లడిస్తూ.. ఉద్యోగులు 18 డిమాండ్లను తమ ముందుంచారన్నారు. ఉద్యోగుల సమస్యలను సానుకూలంగా పరిష్కరించనున్నట్లు తెలిపారు. రేపు ఉదయం 8 గంటలకు ఉపాధ్యాయ సంఘాలతో కూడా చర్చించనున్నట్లు చెప్పారు. ఉద్యోగ సంఘాలతో చర్చలపై రేపు సీఎంకు నివేదిక అందజేస్తామన్నారు. ప్రభుత్వానికి ఉద్యోగులు పూర్తిస్థాయిలో సహకరిస్తున్నరని.. ఇకముందు కూడా సహకారం ఉంటుందని తెలిపారు. ఇప్పటి వరకు ఉద్యోగులను పూర్తిస్థాయిలో ఆదుకున్నట్లు మంత్రి పేర్కొన్నారు